భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పటియాలా అనే నగరానికి చెందిన ఒక సంపన్న సిక్కు కుటుంబంలో కర్తార్ సింగ్ జన్మించారు. తన తల్లిదండ్రులకు అతను ఏకైక కుమారుడు కావడంతో వారి ఆశలన్నీ అతనిపైనే పెట్టుకున్నారు. అన్ని సౌకర్యాలతో ఎంతో విలాసవంతంగా పెరిగిన కర్తార్ సింగుకు అతని తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకూ ఉత్తమమైన విద్యను అందించారు. చిన్న వయస్సులోనే క్రైస్తవ మతం గురించి విన్న కర్తార్ క్రైస్తవ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. తద్వారా అతను పరిశుద్ధ గ్రంథ లేఖనాలను చదవడం మొదలుపెట్టారు. ఆ లేఖనములు తన ఆత్మకు సంతృప్తిని కలిగించేవిగా గుర్తించిన కర్తార్ సింగ్ వాటిని చదువుటకు మరింత ఆసక్తిని కనుపరిచారు. ఎంత ఎక్కువగా వాటిని చదివారో అంత ఎక్కువగా నిజమైన
దేవునిని ప్రేమించారు కర్తార్ సింగ్. చివరికి అతను తన పాపజీవితాన్ని విడిచిపెట్టి, యేసుక్రీస్తును
తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. క్రైస్తవుడిగానే జీవించాలనే అతని నిర్ణయంతో కలత చెందిన
అతని కుటుంబం అతనిని ఇంటి నుండి బయటకు పంపించింది.
ఏదైతేనేమి, తన పిలుపును అర్థం చేసుకున్న కర్తార్ సింగ్ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. పంజాబులోని అనేక గ్రామాలు, పట్టణాలలో సువార్తను ప్రకటించిన తదుపరి ఉన్నత హిమాలయ శిఖరాలు దాటి టిబెట్టు దేశం చేరుకున్నారు. ఆ ప్రదేశంలో బౌద్ధ సన్యాసుల వ్యతిరేకత ఎంతగానో ఉన్నప్పటికీ వెనుతిరుగక టిబెట్ వీధులలో క్రీస్తు ప్రేమను గురించి చాటి చెప్పిన కర్తార్ సింగ్ ఎంతో మంది టిబెట్టు వారిని క్రీస్తు వైపుకు నడిపించారు.
బోధించుటకు ప్రభుత్వ అనుమతి లేనందున అతనిని బంధించి మరణశిక్ష విధించారు. అయినప్పటికీ, క్రీస్తు పట్ల తన విశ్వాసాన్ని తిరస్కరించడానికి కర్తర్ సమ్మతించలేదు. కాబట్టి వారు అతనిని తడిచిన జడల బఱ్ఱె చర్మం లోపలపెట్టి కుట్టిన తరువాత ఎండిపోవుటకు దానిని ఎండలో పెట్టారు. సూర్యుని నుండి వచ్చే వేడిమికి గేదె చర్మం సంకోచిస్తుండటంతో దాని లోపల ఉన్న అతని ఎముకలు ఒక్కొక్కటిగా విరగడం ప్రారంభించాయి. ఈ శ్రమలన్నిటి మధ్యలో
కూడా యేసు క్రీస్తే సజీవుడైన నిజదేవుడని తన చుట్టూ నిలిచి తనను అపహసిస్తున్న ప్రజలకు అతను ఎలుగెత్తి చెప్పారు. తాను అనుభవిస్తున్న ఆ భయంకరమైన బాధను బట్టి అతను ఒక్కసారి
కూడా విలపించలేదు. అంతకంతకు అధికమవుతున్న ఆ గొప్ప శ్రమను మూడు రోజుల పాటు ఓర్పుతో, విశ్వాసంతో సహించి, చివరికి తన ఆత్మను తాను విశ్వసించిన పరమ దేవుని హస్తాలకు అతను అప్పగించారు. ప్రఖ్యాతిచెందిన సువార్తికుడైన సాధు సుందర సింగ్ కూడా టిబెట్ దేశంలో
హతసాక్షిగా మరణించిన కర్తార్ సింగ్ జీవితం ద్వారా
ఎంతో ప్రోత్సాహాన్ని పొందారు.
ప్రియమైన వారలారా, దేవుడు ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్ళి ఆయనను సేవించుటకు మీరును సిద్ధమేనా?
"ప్రభువా, నన్ను సృష్టించుటలో మీకున్న ఉద్దేశ్యమును నేను నెరవేర్చుటకు నాకు నేర్పుము. ఆమేస్!"
No comments:
Post a Comment